అశ్వారావుపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం మండల పరిధిలోని అచ్చుతాపురం గ్రామసమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై చల్ల అరుణ తెలిపిన వివరాలు ప్రకారం దమ్మపేట మండలం జమేదారు బంజరుకు చెందిన మడకం లక్ష్మీపతి (30) ద్విచక్రవాహనంపై అచ్చుతాపుం నుంచి ఇంటికి వెళుతున్నాడు. గ్రామ శివారులోని చెన్నయ్యకట్ట చెరువు సమీపంలో లక్ష్మీపతి ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లక్ష్మీపతి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై చల్ల అరుణ ప్రమాదంగురించిన వివరాలు సేకరించారు. మృతుని భార్య నీలమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.