ముంబై : వృత్తిపరమైన కమ్యూనికేషన్స్లో ఈమెయిల్స్ తప్పనిసరి కావడంతో పాటు గుర్తింపు చిరునామాగానూ మారాయి. మనం చేరవేసే కమ్యూనికేషన్ సురక్షితంగా ఉండేలా చూసుకునేందుకు ఈమెయిల్ ఐడీ వెరిఫికేషన్ కీలకం. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే స్పామ్ల విషయం అటుంచి స్కామ్ల (Cyber Fraud) వంటి సైబర్ దాడులకు గురికాక తప్పదు. పుణేకు చెందిన ఇంజనీరింగ్ సరఫరాల సంస్ధకు ఇదే తరహాలో స్కామర్లు ఏకంగా రూ. 22 లక్షలకు కుచ్చుటోపీ పెట్టారు. ఈమెయిల్ అడ్రస్లో ఒకేఒక్క పదంలో తేడాను గుర్తించకపోవడంతో ఆ సంస్ధకు భారీ నష్టం వాటిల్లింది.
ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్య పుణేకు చెందిన కంపెనీ 51,000కు పైగా విలువైన ఆర్డర్ను ఓ ఫ్రెంచ్ కంపెనీకి ఇచ్చింది. ఆపై ఆర్డర్ను గత కొన్నేండ్లుగా పుణే కంపెనీతో కాంటాక్ట్లో ఉన్న సదరు ఫ్రెంచ్ కంపెనీ సేల్స్ మేనేజర్ ఈమెయిల్ అడ్రస్కు పంపారు. ఆర్డర్ను నిర్ధారించేందుకు ఫ్రెంచ్ కంపెనీ ప్రొఫార్మా ఇన్వాయిస్ను పంపింది. ఇక తమ ప్యారిస్కు చెందిన బ్యాంక్ ఖాతా, స్విప్ట్ కోడ్ పనిచేయడం లేదని, బదులుగా లిస్బన్లోని బ్యాంక్లో తమ నూతన ఖాతాలో పేమెంట్ చేపట్టాలని కోరింది.
ఈ కమ్యూనికేషన్ నిజమైనదని నమ్మిన పుణే కంపెనీ ఎగ్జిక్యూటివ్లు పోర్చుగీస్కు చెందిన ఫ్రెంచ్ కంపెనీ నూతన బ్యాంకు ఖాతాలో 24,589 యూరోలు అడ్వాన్స్గా చెల్లించారు. ఆపై పరికరాలు దిగుమతి కాకపోవడంతో పుణే కంపెనీ ఫ్రెంచ్ సంస్ధను వాకబు చేయగా తమకు ఎలాంటి చెల్లింపులు రాలేదని తెలిపింది. గతంలో బ్యాంక్ ఖాతా మారిందని చేరవేసిన ఈమెయిల్ తాము పంపింది కాదని ఫ్రెంచ్ కంపెనీ తేల్చిచెప్పడంతో ఇది స్కామర్ల పనిగా వెల్లడైంది. ఏ స్ధానంలో ఈ అని ఒకేఒక్క పదం తేడాతో ఫ్రెంచ్ కంపెనీ ఈమెయిల్ను పోలిఉన్న ఈమెయిల్ ఐడీతో సైబర్ నేరగాళ్లు పుణే కంపెనీని బురిడీ కొట్టించారు. మోసపోయామని గ్రహించిన కంపెనీ ప్రతినిధులు పుణే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read More :
Health | బరువు తగ్గాలంటే వీటిని పక్కన పెట్టాల్సిందే.. పలు సూచనలు చేసిన డబ్ల్యూహెచ్వో