దుండిగల్: తన భార్య మరణానికి బావే కారకుడనే అనుమానంతో బావమరిది కుటుంబసభ్యులు పథకం ప్రకారం ఇంటికి పిలిచి దారుణంగా హతమార్చారు. కొట్టి చంపుతున్నామని హతుడి కుటుంబసభ్యులకు ఫోన్చేసి చెప్పి మరీ దారుణానికి ఒడిగట్టారు. ఈ సంఘటన సూరారం కాలనీలో తీవ్రకలకలం సృష్టించింది. సీఐ రమణారెడ్డి, హతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…నాగర్కర్నూల్ జిల్లా,పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందిన పసుపుల ఆంజనేయులు(45), సరస్వతి దంపతులు. కుటుంబకలహాల నేపథ్యంలో ఆంజనేయులు తన గ్రామంలోనే నివాసముంటుండగా భార్య సరస్వతి, కుమార్తె జ్యోతి, వదిన లక్ష్మీ కుటుంబసభ్యులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట సమీపంలోని లెనిన్నగర్లో నివాసముంటున్నారు.
దీంతో ఆంజనేయులు తరచూ నగరానికి వచ్చిపోతుంటాడు. కాగా ఆంజనేయులు బావమరిది మైసయ్య కుటుంబంసైతం సుభాశ్నగర్ డివిజన్ పరిధి, సూరారంకాలనీలోని దయానంద్నగర్లో నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో మైసయ్య భార్య యాదమ్మ మూడు నెలల క్రితం ఘట్కేసర్లో హత్యకు గురైంది. అయితే యాదమ్మ మరణానికి ఆంజనేయులు కారణమని భావించిన మైసయ్య కుటుంబసభ్యులు అప్పటి నుంచి అతన్ని హతమార్చేందుకు అదును కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ఆంజనేయులు లెనిన్నగర్లో ఉన్నట్లు తెలుసుకున్న మైసయ్య కుటుంబసభ్యులు బుధవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఆంజనేయులకు ఫోన్చేసి మందు తాగుదాం రమ్మంటూ దయానంద్నగర్లోని తన ఇంటికి పిలిపించుకున్నాడు. వెంటనే ఆంజనేయులు దయానంద్నగర్కు చేరుకోగా అందరూ కలిసి గురువారం అర్థరాత్రి 1 గంటల వరకు మద్యం సేవించారు.
అనంతరం ఆంజనేయులుతో పథకం ప్రకారం గొడవకు దిగిన మైసయ్య(45), అతని కొడుకులు గంగులు(25), పవన్ ఆలియాస్ లడ్డూ లతో పాటు మైసయ్య సోదరుడి భార్య యాదమ్మ, కర్రలతో చితక బాదడంతో పాటు కాళ్లు ,చేతులు విరగ్గొట్టి, చిత్రహింసలు పెట్టారు. ఇదే విషయాన్ని హతుడి కూతురు జ్యోతి, భార్య సరస్వతికి ఫోన్చేసి చెప్పారు.
దీంతో ఆంజనేయులును ఏమి చేయవద్దని, ఉదయం కూర్చుని మాట్లాడుకుందామని, అవసమైతే పోలీస్స్టేషన్లో అప్పగించి సమస్యను పరిష్కరించుకుందామని వేడుకున్నారు. అయినప్పటికి వినకుండా ఫోన్ కట్చేసిన మైసయ్య కుటుంబసభ్యులు ఆంజనేయులును హతమార్చారు. ఇదే విషయాన్ని గంగులు స్నేహితుడు శివ, అలియాస్ చింటూ మళ్లి జ్యోతికి ఫోన్ చేసి ఆంజనేయులును చంపామని, శవాన్ని తీసుకెళ్లమని చెప్పి ఫోన్ కట్చేశారు.
వెంటనే హతుడి కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ఆంజనేయులు రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు. జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శవాన్ని పోస్ట్మార్టం కోసం గాంధీవైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలాన్నిపేట్బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు పరిశీలించారు. కాగా హత్యకు కారకులైన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.