లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా 15 ఏండ్ల బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన మీరట్ జిల్లాలో వెలుగుచూసింది. ట్రాన్స్పోర్ట్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్యానా గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇంటిలోపల నిర్మాణ పనులు జరుగుతుండటంతో తామంతా ఇంటి పైన నిద్రిస్తున్నామని బాలిక నీళ్లు తాగేందుకు కిందకు వెళ్లగా గ్రామానికి చెందిన యువకుడు బాలికకు మత్తుమందు ఇచ్చి అపహరించాడని కుటుంబసభ్యులు చెప్పారు.
ఆపై అక్కడికి సమీపంలోని పొలంలోకి తీసుకునివెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక కనిపించకపోవడంతో గాలిస్తున్న కుటుంబ సభ్యులకు పొలంలో అపస్మారకస్ధితిలో బాధితురాలు కనిపించింది. మెడికల్ కాలేజ్ దవాఖానకు తరలించగా వైద్య పరీక్షల అనంతరం ఆమెపై లైంగిక దాడి జరిగిందని వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై నిందితుడు బంటీని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను నిందితుడు గత కొంత కాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. తనతో స్నేహంగా మెలగకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆమెను బెదిరించేవాడని చెప్పారు.