డిచ్పల్లి, మే 7 : జిల్లాకేంద్రంలో రోడ్షో ముగించుకొని, మంగళవారం కామారెడ్డి జిల్లాకు వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు డిచ్పల్లి నాగ్పూర్ గేటు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ డిచ్పల్లికి వస్తున్నారన్న విషయం తెలుసుకొని, మండలకేంద్రంతోపాటు ఘన్పూర్ చుట్టుపక్కల గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో నాగ్పూర్ గేటు వద్దకు చేరుకున్నారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి, కేసీఆర్ ప్రచార రథంపై పూలవర్షం కురిపించారు. కేసీఆర్ డిచ్పల్లికి చేరుకోగానే నాయకులు పటాకులు కాల్చి అభిమానం చాటుకున్నారు. బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని నినాదాలు చేశారు. ప్రచార రథం నుంచి కేసీఆర్ ప్రజలకు అభివాదం చేశారు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభసభ్యుడు కేఆర్.సురేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీ గంగాధర్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, జీవన్రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సాంబారి మోహన్, సీనియర్ నాయకులు శక్కరికొండ కృష్ణ, దాసరి లక్ష్మీనర్సయ్య, నల్లవెల్లి సాయిలు, పద్మారావు, ఒడ్డెం నర్సయ్య, జాకీర్, అంజయ్య, నడ్పన్న ఉన్నారు.