Road Accident | దైవ దర్శనం కోసం వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఢిల్లీ – ముంబయి ఎక్స్ప్రెస్ వేపై ఆదివారం ఉదయం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. బౌన్లీ పోలీస్స్టేషన్ పరిధిలోని బనాస్ వంతెన సమీపంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది.
రణతంబోర్ గణేశ్ ఆలయ దర్శనానికి వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నది. మృతులను సికార్కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొట్టడంతో అందులో ఉన్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించారు. ఇద్దరు పిల్లలను మొదల బౌన్లీలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ఆ తర్వాత జైపూర్కు రిఫర్ చేశారు.