భవన నిర్మాణ పని చేసే ఒక పేదవాడు.. రాత్రివేళ ఒక హోటల్కు వెళ్లి.. భోజనం ఏమైనా మిగిలి ఉంటే ఇవ్వమని అడిగాడు. అక్కడ ఉన్న మందుబాబులు అతడిని చితకబాదారు. దీంతో అతడు మృతిచెందాడు. మృతుడి భార్య హోటల్ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హైదరాబాద్లోని మాధాపూర్ ప్రాంతంలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన రాజేశ్(32) అనే భవన నిర్మాణ కూలీ హైదారాబాద్లోని మాదాపూర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. గత బుధవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి వెళుతున్న సమయంలో పక్కనే ఒక హోటల్ బేస్మెంట్లో అక్కడి మేనేజర్ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. పార్టీలో ఉన్నవారంతా మద్యం సేవించి ఉన్నారు.
రాజేశ్ అక్కడికి వెళ్లి తన పిల్లలకోసం ఏమైనా మిగిలి ఉన్న భోజనం ఇవ్వమని అడిగాడు. దీంతో పార్టీ చేసుకుంటున్న ఆ మేనేజర్, అతని స్నేహితులు.. రాజేశ్ అనుమతి లేకుండా లోపలికి వచ్చినందుకు అతడిని దొంగగా భావించి చితకబాది అక్కడే వదిలి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం హోటల్ సిబ్బంది వచ్చి చూడగా.. రాజేశ్ ఇంకా అక్కడే పడిఉన్నాడు.
హోటల్ సిబ్బంది రాజేశ్ పరిస్థితి విషమంగా ఉండడం గమనించి, అతడి జేబులో ఉన్న ఆధారాలతో అతడి భార్యకు ఫోన్ చేశారు. ఆ తరువాత రాజేశ్ భార్య అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. రాజేశ్ చికిత్సపొందుతూ మరణించాడు. వలస కార్మికుడైన రాజేశ్కు ఒక భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
రాజేశ్ భార్య హోటల్ మేనేజర్, అతని స్నేహితులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు.