భద్రాద్రి కొత్తగూడెం : చెర్ల మండలం కుర్నపల్లి గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ను పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు నరికి చంపారు. నలుగురు మావోయిస్టులు సోమవారం అర్ధరాత్రి ఉప సర్పంచ్ ఇర్ప రామారావు నివాసానికి చేరుకొని అతని వెంట తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు ప్రాధేయపడినా వినకుండా.. అతన్ని వెంట తీసుకువెళ్లారు.
మంగళవారం తెల్లవారుజామున రక్తపు మడుగులో గ్రామ శివారులో శవమై కనిపించాడు. ఘటనా స్థలంలో సీపీఐ (మావోయిస్ట్) చెర్ల-శబరి ఏరియా కమిటీ పేరిట లేఖను వదిలి వెళ్లారు. పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడని, అందుకే శిక్ష విధించినట్లు లేఖలో పేర్కొన్నారు. పోలీసులు ఇచ్చే డబ్బు కోసం అత్యాశతో ఇన్ఫార్మర్లుగా పని చేయొద్దని లేఖలో హెచ్చరించింది.