Korutla | తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి విచక్షణ మరిచిపోయాడు. అప్పు ఇవ్వనని చెప్పిన పాపానికి బ్లేడుతో పొరుగింటి వ్యక్తి గొంతు కోశాడు. అదృష్టం బాగుండటంతో సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గంగంపేట కాలనీలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
జగిత్యాల పట్టణంలోకి గంగంపేట కాలనీకి చెందిన షారుక్ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తాగుడుకు బానిసైన షారుక్.. శుక్రవారం రాత్రి మద్యం కొనేందుకు డబ్బులు లేకపోవడంతో తన ఎదురింట్లో కిరాయి ఉంటున్న గౌస్ను రూ.200 అప్పు అడిగాడు. కానీ అతను డబ్బులు లేవని చెప్పడంతో షారుక్ ఆగ్రహానికి గురయ్యాడు. నాకే డబ్బులు ఇవ్వవా అంటూ గౌస్తో గొడవపడ్డాడు. ఆ కోపంలోనే తన దగ్గర ఉన్న బ్లేడ్తో గౌస్ గొంతు కోశాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రుడిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గౌస్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.