ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల కూడా చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. ఇటీవల ఒక వ్యక్తికి కూడా అదే జరిగింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)లో టికెట్ బుక్ చేసుకోవడం కుదరకపోవడంతో.. ఆ డబ్బు రిఫంట్ కోసం అతను ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఏకంగా రూ.1.78 లక్షలు పోగొట్టుకున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ట్యూషన్ టీచరుగా పనిచేసే సదరు బాధితుడు నాసిక్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకోవడం కోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్కు వెళ్లాడు. అయితే ఏదో సాంకేతిక సమస్య కారణంగా టికెట్ బుక్ అవ్వలేదు. తన ఖాతాలో కట్ అయిన రూ.578 తిరిగి రాకపోవడంతో అతను రిఫండ్ కోసం ప్రయత్నించాడు. ఐఆర్సీటీసీ హెల్ప్లైన్ నెంబరు కోసం గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక నెంబరు దొరికింది.
కానీ అది ఒక సైబర్ మోసగాడి నెంబరు. ఈ విషయం తెలియని బాధితుడు ఆ నెంబర్కు కాల్ చేయడంతో.. అతన్ని మోసగించిన సైబర్ మోసగాడు. ఏకంగా రూ.1.78 లక్షలు కాజేశాడు. దీంతో తను మోసపోయానని తెలుసుకున్న ట్యూషన్ టీచర్.. పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.