ముంబై : ఎయిర్పోర్ట్లో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను గుర్తించేందుకు నకిలీ విమాన టికెట్లతో విమానాశ్రయంలోకి ఎంటరైన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రయాణీకుడిగా ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించిన వ్యక్తిని అంధేరికి చెందిన నూర్ ఆలం మహ్మద్ ఖయ్యూమ్ షేక్ (37)గా గుర్తించారు. ముంబై ఎయిర్పోర్ట్లో వారం కిందట ఖయ్యూమ్ ఫోన్ మిస్ అయింది. అప్పటి నుంచి ఫోన్ను గుర్తించేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడు.
ఎయిర్పోర్ట్కు వెళ్లేందుకు మరో మార్గం లేకపోవడంతో నకిలీ విమాన టికెట్ను సృష్టించి ఫోన్ను వెతుక్కునేందుకు స్కెచ్ వేశాడు. అతడి ప్లాన్ బెడిసికొట్టడంతో వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణీకుడిగా చెబుతూ విమానాశ్రయంలోకి వచ్చిన ఖయ్యూమ్ షేక్ను విస్తారా ఎయిర్లైన్స్ ఉద్యోగులు గుర్తించారు. ముంబై నుంచి దుబాయ్ వెళ్లే విమానం టికెట్ను చూపుతూ నిందితుడు ఎయిర్పోర్ట్ డిపార్చర్ ఏరియాలోకి ప్రవేశించాడు.
విస్తారా సిబ్బంది అతడి టికెట్ను మరోసారి చెక్ చేయగా ఎయిర్లైన్ ఏ ప్రయాణీకుడికి అలాంటి టికెట్ జారీ చేయలేదని గుర్తించారు. అది ఒరిజినల్ టికెట్ కాదని తేల్చారు. విస్తారా సిబ్బంది అతడిని సీఐఎస్ఎఫ్కు అప్పగించగా వారు ప్రశ్నించిన మీదట సహర్ పోలీసులకు అప్పగించారు. ఖయ్యూమ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More