Mumbai station | ముంబై రైల్వే స్టేషన్ (Mumbai Railway Station) లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మహిళతో గొడవ పడుతున్న సమయంలో ఓ వ్యక్తి రైల్వే ట్రాక్పై పడిపోయాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రైలు ఢీ కొని అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బాధితుడు బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (Brihanmumbai Electric Supply & Transport)లో పనిచేస్తున్న 26 ఏళ్ల దినేశ్ రాథోర్ (Dinesh Rathore) గా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు (Railway Police) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మహిమ్ ప్రాంతానికి వెళ్లేందుకు శీతల్ మేని (Sheetal Mane) అనే 30 ఏళ్ల మహిళ తన భర్త అవినాష్ (Avinash)తో కలిసి ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ముంబైలోని సియోన్ స్టేషన్ (Sion station)కి వచ్చింది. ఈ క్రమంలో అక్కడే ప్లాట్ఫామ్పై ఉన్న దినేశ్ అనుకోకుండా శీతల్ను ఢీ కొట్టాడు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఆ మహిళ తన వద్ద ఉన్న గొడుగుతో దినేశ్ను కొట్టడం మొదలు పెట్టింది. మధ్యలో ఆమె భర్త అవినాష్ కూడా వచ్చి దినేశ్ను కొట్టడం తో బాధితుడు ఒక్కసారిగా రైలు పట్టాలపై పడిపోయాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన లోకల్ ట్రైన్ దినేశ్ను ఢీ కొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రైల్వే స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు అయ్యాయి. ఘటనపై రైల్వే పోలీసులు ముందుగా ప్రమాదకర మరణంగా కేసు నమోదు చేశారు. అయితే విచారణలో భాగంగా స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. అవినాష్ కొట్టడంతో బాధితుడు దినేశ్ రైల్వే ట్రాక్పై పడిపోయినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన దంపతులను అదుపులోకి తీసుకున్నారు.
Also Read..
Kochi Mall | బుర్ఖా ధరించి మహిళల వాష్రూమ్లోకి ప్రవేశించిన వ్యక్తి.. వీడియో రికార్డు చేస్తూ..
Joe Biden | వాటి గురించి అడిగితే సాయం చేస్తా.. పిల్లలతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ సరదా వ్యాఖ్యలు