అతి తెలివికి పోయిన ఒక వ్యక్తిని స్థానికులు చితకబాదారు. దొంగ నోట్లు ముద్రించి వాటిని ఉపయోగించడానికి చూశాడా వ్యక్తి. షాపు ఓనర్కు అది దొంగనోటు అని తెలియగానే.. కస్టమర్ను పట్టేసుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా కూడా కలిసి అతన్ని చితక్కొట్టారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని బాంకూర్ జిల్లాలో వెలుగు చూసింది. గురుపాద ఆచర్జీ అనే వ్యక్తి శ్యామలనగర్లోని ఒక బొమ్మల దుకాణానికి వెళ్లాడు.
షాపులో కొన్ని బొమ్మలు కొనుగోలు చేసిన తర్వాత రూ.500 నోటు ఇచ్చాడు. అది దొంగ నోటు అని షాపు ఓనర్ గుర్తించాడు. గొడవ చూసి అక్కడకు వచ్చిన స్థానికులంతా కలిసి గురుపాద ఆచర్జీని చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అతన్ని కాపాడారు. అనంతరం ఆచర్జీ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా.. సుమారు రూ.1.65 లక్షల విలువైన దొంగ నోట్లు దొరికాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతన్ని అరెస్టు చేశారు.