హైదరాబాద్ : నగరంలోని పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ ప్రేమజంట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ సతీష్ కుమార్ తెలిపిన వివరాలివి.. పంజాగుట్టలోని ఓ ప్రముఖ హోటల్లో పుదుచ్చేరికి చెందిన విజయకుమార్(34), శ్యామలదేవి (36) ఈ నెల 8 నుంచి గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఫుడ్ ఆర్డర్ చేయలేదు.
రూమ్ సర్వీస్ గురించి సైతం ఫోన్ చేయకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హోటల్కు చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే ఇద్దరు మంచంపై విగతజీవులై పడి ఉన్నారు. ఘటనాస్థలంలో తమిళంలో రాసి ఉన్న సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక విచారణలో గతంలోనే ఇద్దరికి వేర్వేరు వ్యక్తులతో వివాహం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధమే ఆత్మహత్యలకు కారణమని భావిస్తున్నారు. తమిళంలోని సూసైడ్ నోట్ను అనువదించిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్ఐ సతీష్ కుమార్ వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.