ఎక్కడికక్కడే నిర్ణయం..
మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నిరంతరం పర్యటిస్తూ అధికారుల ఏమరుపాటు, పోలీసుల ఓవర్ యాక్షన్ ఇలా ప్రతి అంశాన్ని టచ్ చేస్తున్నారు. కొవిడ్ బారిన పడ్డ ఉమ్మడి జిల్లా ప్రజలను కాపాడుకుంటూనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి జీవనం సాగించే వారిని కూడా ఆదుకుంటామని యాదాద్రి పవర్ప్లాంట్లో అత్యవసరంగా ఐసొలేషన్ కేంద్రం చేయించారు. అక్కడ 10 రోజుల్లో 20 పడకల దవాఖానను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను సందర్శించిన సమయంలో కొవిడ్ రోగుల బాగోగులు తెలుసుకున్నారు. ఏ సమయంలోనూ ఆక్సిజన్ కొరత ఉండకుండా త్వరలోనే సూర్యాపేటలో ఆక్సిజన్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామనగా ఆ మేరకు అడుగులు పడుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని ఇచ్చిన ఆదేశాలతో అధిక ఫీజులకు కట్టడి పడింది. కాగా హుజూర్నగర్ ఆస్పత్రిని సందర్శించిన సమయంలో డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ఏరియా దవాఖానను సందర్శించి వైద్య సేవలను అడిగి తెలుసుకొని అక్కడ విద్యుత్ సమస్య లేకుండా పాత జనరేటర్ స్థానంలో కొత్త జనరేటర్ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేతో కరోనా కట్టడి జరుగుతుందని ప్రజలకు అవగాహన కల్పిస్తూ స్వయంగా మంత్రి కూడా ఇంటికి వచ్చిన ఆరోగ్య సిబ్బందితో పరీక్షలు చేసుకొని సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరారు.
స్థానికంగా ఉంటూ..
మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేటలోనే ఉంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విరివిగా పర్యటిస్తూ అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. దవాఖానల్లో చికిత్సకు ఆటంకాలు ఎదురు కాకుండా ఉన్నతాధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు మందులు, ఇంజెక్షన్లు తెప్పిస్తున్నారు. ఏప్రిల్ 28న సూర్యాపేటలో మూడు జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష చేపట్టగా మే 7న సూర్యాపేట, మే 12న నల్లగొండ, మే 13న యాదాద్రి, మే 14న మరోసారి సూర్యాపేటలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మే 17న సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రి, అనంతరం నాగార్జునసాగర్ వెళ్లి అక్కడ కమలానెహ్రూ దవాఖానను సందర్శించి కొవిడ్ చికిత్స, మందులు, ఆక్సిజన్ నిల్వలను పరిశీలించారు. అంతే కాకుండా అనునిత్యం అధికారులతో ఫోన్లో మాట్లాడి లాక్డౌన్ అమలు, దవాఖానల్లో చికిత్స వివరాలను అడిగి తెలుసుకుంటుండడంతో ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయి.
ఐసొలేషన్ నుంచి కొవిడ్ వార్డుగా..
గతేడాది కరోనా ప్రారంభమైన నాటి నుంచి సూర్యాపేట ప్రభుత్వ జనరల్ దవాఖానలో కరోనా రోగులకు సేవలు అందుతున్నాయి. మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో కొద్దిరోజుల క్రితం వరకు ఐసోలేషన్ వార్డులకే పరిమితమైన హుజూర్నగర్, కోదాడతోపాటుపాటు తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. హుజూర్నగర్లో 60 పడకలు, కోదాడలో 30 పడకలు, తుంగతుర్తిలో 12 పడకలతో వార్డులు సిద్ధంగా ఉన్నాయి. ఆయా ఆస్పత్రుల్లో ఆక్సిజన్తోపాటు అన్ని రకాల మందులు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లుకూడా రెడీగా ఉన్నాయి.
ఎమ్మెల్యేలు కూడా..
మంత్రి జగదీశ్రెడ్డి నిరంతర పర్యటనలు, ఆదేశాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు కూడా ఆస్పత్రులు సందర్శిస్తున్నారు. లాక్డౌన్ అమలును పర్యవేక్షిస్తున్నారు. పీహెచ్సీలకు వెళ్తూ కొవిడ్ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. హోంఐసొలేషన్లో ఉన్న వారికి హెల్త్ కిట్లు పంపిణీ చేస్తూ మనోధైర్యం నింపుతున్నారు. అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.