జగిత్యాల : ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై కబ్జాదారులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన కోరుట్ల పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కోరుట్ల పట్టణంలో సర్వే నెంబర్ 1287 లో అత్యంత విలువైన ప్రభుత్వ భూములను దురాక్రమణ చేసేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారనే పక్కా సమాచారంతో రెవెన్యూ అధికారులు అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు.
అనంతరం ఆక్రమణలు తొలగిస్తున్న సమయంలో అక్రమదారుల అనుచరులు రెవెన్యూ అధికారులపై దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాస్ అనే వీఆర్ఏకు గాయాలయ్యాయి. అలాగే రెవెన్యూ అధికారులకు చెందిన మూడు సెల్ ఫోన్లను లాక్కున్నారు. విషయం తెలిసిన స్థానిక తహసీల్దార్ రాజేష్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పోలీసుల సహాయంతో ఆక్రమణలు తొలగించారు.
ఆక్రమణదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ భూమిలో ఎవరైనా ఆక్రమణకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.