చాంద్రాయణగుట్ట : బామ్మర్థిని హత్య చేయించిన సొంత బావ (హోంగార్డు)తో పాటు హత్యకు సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను ఫలక్నుమా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.సోమవారం ఫలక్నుమా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ వివరాలను వెల్లడించారు.
పాతబస్తీ జహనుమాకు చెందిన మహ్మద్ ఆరీఫ్ అలియాస్ సోయబ్ (32) కు సంగారెడ్డి ప్రాంతానికి చెందిన అమ్మాయితో ఇటివలే పెండ్లి కుదిరింది. ఇరువురు కుటుంబ సభ్యులు చర్చించుకొని వచ్చే ఏడాది జనవరిలో పెండ్లి చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఇదిలా ఉండగా నెల రోజులుగా పెండ్లి కూతురికి ఆరోగ్యం బాగుండటం లేదు.
దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ఆమె కొలుకోవాలని తెలిసిన బాబాలను కలిశారు. ఇదే క్రమంలో ముంబైలో క్షుద్రపూజలు నిర్వహించే ఓ బాబాను కలిసి అమ్మాయి ఆరోగ్యం బాగుచేయాలని కోరారు. చేతబడి పూజలు నిర్వహించిన బాబా పెండ్లి చేసుకోబోయే పెండ్లి కొడుకు తరుపున బంధువులే మీ అమ్మాయి ఆరోగ్యం బాగుండద్దని చేతబడి చేయించారని చెప్పడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ఇదే విషయం పెండ్లి కొడుకు ఆరీఫ్కు చెప్పారు.
హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహించే తన సొంత బావనే నా పెండ్లి కావొద్దని చేతబడి చేయించి ఉండోచ్చనే అభిప్రాయానికి ఆరీఫ్ వచ్చాడు. నేను పెండ్లి చేసుకోవొద్దనే కాబోయే భార్యకు చేతబడి చేయించావు అంటూ ఆరీఫ్ కొద్ది రోజుల క్రితం బావతో గొడవకు దిగాడు.
నీవే చేతబడి చేయించావ్..కాబట్టి బాగు చేయడానికి కూడా డబ్బులు నీవే ఇవ్వాలి అంటూ తరుచూ ఆరీఫ్ (అక్కభర్త) బావ మహ్మద్ సమీ మొయినుద్దీన్ (32) పై ఒత్తిడి తెచ్చాడు. తనకు సంబంధం లేదని మొయినుద్దీన్ ఎన్నిసార్లు చెప్పిన మాట వినకపోవడంతో రూ.50 వేలు ఇచ్చాడు. అయినప్పటికీ ఆరీఫ్లో మార్పు రాలేదు. తరుచూ వైద్యం కోసం అంటూ డబ్బులు అడుగుతున్నాడు.
మొయినుద్దీన్ వేదింపులు భరించలేక బామ్మర్ది ఆరీఫ్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 13న రాత్రి 11 గంటల సమయంలో ఇంటి వద్ద ఆరీఫ్ ఫోన్ మాట్లాడుతుండగా మహ్మద్ మొయినుద్దీన్ సోదరుడు అజర్ మొయినుద్దీన్ (25), తమ్ముడి స్నేహితులు మహ్మద్ అలీ (21), అమేర్ మహ్మద్ఖాన్ (26) ఆరీఫ్ కండ్లలో కారంపొడి కొట్టి కత్తులు, గొడ్డలితో నరికి చంపి పారిపోయారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలను సేకరించి రెండు రోజుల్లోనే నిందితులను గుర్తించారు.విశ్వసనీయ సమాచారం మేరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.కేసును ఫలక్నుమా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.