న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ వ్యూహంపై శివసేన తీవ్ర విమర్శలు గుప్పించింది. దేశంలో వ్యాక్సినేషన్ వ్యవస్థ స్తంభించడంతోనే భారత్ లో కరోనా మరణాలు అధికంగా నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర వ్యాక్సిన్ విధానం మరింత సమగ్రంగా ఉండాలని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో శివసేన పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ విధానం లోపభూయిష్టంగా, అసంబద్ధంగా ఉందని సుప్రీం కోర్టు మండిపడిన నేపథ్యంలో శివసేన కేంద్ర వ్యాక్సిన్ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
పీఎం కేర్స్ ఫండ్స్ లో వేలాది కోట్ల రూపాయలు జమయినా దేశంలో పడకలు, మందులు, ఆక్సిజన్ లేదని శివసేన కేంద్రంపై విరుచుకుపడింది. వ్యాక్సినేషన్ ఇదే పద్ధతిలో కొనసాగితే 2024 లేదా 2025 నాటికి భారతీయులందరికీ వ్యాక్సినేషన్ పూర్తవుతుందని పేర్కొంది. వైరస్ తరచూ కొత్త మార్పులకు లోనవుతుంటే నూతన వ్యాక్సిన్లను ప్రారంభిస్తూ ఫార్మా కంపెనీలు సొమ్ము చేసుకుంటాయని పేర్కొంది. సమగ్ర వ్యాక్సినేషన్ వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని శివసేన డిమాండ్ చేసింది.