కొడంగల్: రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొంటుందని, సమీకృత రహదారి ప్రమాద సమాచార వ్యవస్థను అమలులోకి తీసుకొచ్చినట్లు సీఐ అప్పయ్య తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లోని సీఐ కార్యాలయంలో నేషనల్ హైవే అథారిటీ సిబ్బంది నెహ్రూ పోలీసులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించిన అనంతరం దిద్ధుబాటు చర్యలను చేపట్టాలనే వ్యూహంతో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇంటిగ్రేటెడ్ రోడ్డు యాక్సిడెంట్ డేటాబేస్ (ఐ-రాడ్)ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
ఐఐటీ మద్రాస్తో పాటు జాతీయ సమాచార కేంద్రం సంయుక్తంగా రూపొందించిన మొబైల్ అప్లికేషన్పై పోలీసులకు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కొడంగల్ పరిధిలోని బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న రోడ్డు ప్రమాద ప్రాంతాల సమాచారాన్ని మొబైల్ అప్లికేషన్లో అప్లోడ్ చేసే ప్రక్రియపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
దేశవ్యాప్తంగా ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో సురక్షిత ప్రయాణాల దిశగా ఐ-రాడ్ను అమలులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడ ప్రమాదం జరిగినా ఈ అప్లికేషన్ ద్వారా సమాచారం తెలిసే అవకాశం ఉన్నదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ పోలీస్స్టేషన్ల ఎస్ఐలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.