అమరావతి :మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిలు మంజూరు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. కేసు తీవ్రత,ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని దిగువ కోర్టు సైతం బెయిలు నిరాకరించిందని గుర్తుచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ ఈ మేరకు నిర్ణయాన్ని వెల్లడించారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న డి.శివ శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన, సీబీఐ పులివెందుల కోర్టులో హాజరుపరిచింది. న్యాయస్థానం శివశంకర్ రెడ్డికి బెయిలు నిరాకరిస్తూ డిసెంబర్ 21న ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో నిందితుడు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు.
సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ .. పిటిషనర్ నేరానికి పాల్పడ్డట్టు ఆధారాలు లేవన్నారు. పోలీసులు మొదట నమోదు చేసిన కేసులో ఆయన పేరు లేదన్నారు. తర్వాత సీబీఐ అధికారులు ఆయన్ని ఇరికించారన్నారు. హత్య కేసులో మరో నిందితుడు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ పిటిషనర్ను అరెస్ట్ చేసిందన్నారు. దస్తగిరితో పాటు పలువురు నిందితులు ఇప్పటికే బెయిలుపై బయట ఉన్నారన్నారు.