సంగారెడ్డి : జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. 992 కిలోల ఎండు గంజాయిని సదాశివపేట పోలీసులు పట్టుకున్నారు. సోమవారం సదాశివపేట పోలీసు స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా ఎస్పీ రమణకుమార్ మాట్లాడుతూ..ఆదివారం సదాశివపేట పోలీసులు జాతీయ రహదారి 65 వై జంక్షన్పై తనిఖీలు నిర్వహించామన్నారు.
హారిక పెట్రోల్ పంపు వద్ద మహారాష్ట్రకు చెందిన (ఎంహెచ్18 ఏఏ 7851) నంబర్ గల లారీలో 496 ప్యాకెట్ల గంజాయి ఒక్కొక్కటి రెండు కిలోలు మొత్తం 992 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. అదే విధంగా లారీకి ముందు పైలెట్గా చేస్తూ ముందు ఎవ్వరైనా పోలీసులు ఉన్నారా అనే సమాచారాన్ని అందిస్తూ వస్తున్న ఇన్నోవా కారు (ఎంహెచ్18ఏసీ 0744) ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
లారీలోని గంజాయిని ఏపీలోని రాజమండ్రి నుంచి మహారాష్ట్రలోని ఔరంగబాద్కు తరలిస్తున్నారని వివరించారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న వీరంతా మహారాష్ట్ర నాసిక్ జిల్లాకు చెందిన వారని, వారిలో అల్తాప్, అబ్దుల్ రహమాన్ ఖిల్లా, ఫేక్ అమీన్ పట్కీనారా, ముస్తాక్ అహ్మద్ ను అరెస్టు చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
విచారణలో ఫిరోజ్ సూచనల మేరకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారని తెలిపారు. ఫిరోజ్ పరారీలో ఉన్నారని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన లారీ, ఇన్నోవా కారు, నాలుగు మొబైల్ ఫోన్లు, 992 కిలోల గంజాయి, అల్తాప్ నుంచి రూ.7500ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి రవాణా ఎవరైనా రవాణా చేసినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.