Gold Seize | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ. 82.42 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. సోమ, మంగళవారాల్లో తనిఖీలు నిర్వహించగా.. ఇద్దరు ప్రయాణికుల వద్ద బంగారం పట్టుబడినట్లు పేర్కొన్నారు.
దోహా నుంచి సోమవారం అర్ధరాత్రి ఓ ప్రయాణికుడు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. అతని వద్ద రూ. 42.96 లక్షల విలువ చేసే 701 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. అయితే ఈ బంగారాన్ని పురీషనాళంలో దాచి తరలిస్తుండగా పట్టుబడ్డాడు.
బ్యాంకాక్ నుంచి మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టు చేరుకున్న మరో ప్రయాణికుడి నుంచి 700 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. దీని విలువ రూ. 39.46 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రయాణికుడు కూడా పురీష నాళంలో దాచి బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.