అమరావతి: తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో దారుణం జరిగింది. ఈ ఘటనలో తండ్రి తాతూరి బంగార్రాజు తన పదేళ్ల కుమారుడికి విషమిచ్చి, ఆ తర్వాత ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న స్థానిక సబ్ఇన్స్పెక్టర్ శుభశేఖర్ వారిని ఆస్పత్రికి తరలించారు. బంగార్రాజుకు14 ఏళ్ల కూతురు, 12,10 ఏళ్ల కుమారులు ఉన్నారు. ముగ్గురు వంగలపూడిలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువు చదువుకుంటున్నారు. భార్య కువైట్లో ఉంటుంది. భార్యతో కుటుంబ కలహాలు ఉన్నాయి.ఈ నెల13న సంక్రాంతి సందర్భంగా బంగార్రాజు వంగలపూడిలోని మామగారి ఇంటికి వచ్చాడు.
ఈ నేపథ్యంలో బంగార్రాజు తన ముగ్గురు పిల్లలతో సీతానగరం కైలాస భూమికి చేరుకున్నాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న బంగార్రాజు కూల్ డ్రింక్లో ఎలుకల మందు కలిపి పదేళ్ల కొడుకు ప్రజ్వల్కు బలవంతంగా తాగించాడు. సమాచారం అందుకున్న సబ్ ఇన్స్పెక్టర్ శుభశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని సీతానగరం బస్టాండ్ సెంటర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించి ఇద్దరినీ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.