Encounter @ Varanasi | ఉత్తరప్రదేశ్ వారణాసిలో సోమవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు దుండగులు హతమయ్యారు. భెల్ఖా గ్రామ సమీపంలోని రింగ్ రోడ్డులో ఈ ఎన్కౌంటర్ జరిగింది. 15 రౌండ్లకు పైగా కాల్పులు జరిగినట్లు తెలుస్తున్నది. పోలీసు కాల్పుల్లో చనిపోయిన వారిద్దరూ సోదరులే. గత కొన్నాళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతూ చివరకు పోలీస్ ఎన్కౌంటర్లో హతమవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. తప్పించుకు పారిపోయిన మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వారణాసి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దుండగులు ఇటీవల పట్నా బార్హ్ జిల్లా కోర్టు టాయిలెట్ గోడ పగులగొట్టి పరారయ్యారు. 2017 లో పట్టపగలు బ్యాంకులో దోపిడీకి పాల్పడి రూ. 60 లక్షలు దోచుకెళ్లారు. ఈ సందర్భంగా దుండగులు జరిపిన కాల్పుల్లో క్రైం బ్రాంచ్కు కానిస్టేబుల్ ఒకరు గాయపడ్డారు. బిహార్ పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. రోహనియా ప్రాంతంలో ఇన్స్పెక్టర్ను కాల్చిచంపిన దుండగులు.. అతడి పిస్టల్, కాట్రిడ్జ్లు, పర్సు, మొబైల్ తీసుకొని పరారయ్యారు.
కాగా భెల్ఖా గ్రామ సమీపంలోని రింగ్ రోడ్డులో వారిని గుర్తించిన పోలీసులు లొంగిపోవాలని వారించారు. అయితే, పోలీసులపైకి కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సోదరులిద్దరు చనిపోయారు. వారి నుంచి ఇన్స్పెక్టర్ అధికారిక పిస్టల్, 32 బోర్ కంట్రీ మేడ్ పిస్టల్, బైక్, మొబైల్ సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మరణించిన వారిని రజనీష్ అలియాస్ బువాసింగ్, మనీష్ సింగ్లుగా గుర్తించారు. వీరు సమస్తిపూర్ జిల్లా మొహద్దీనగర్ పీఎస్ పరిధిలోని గోల్వా నివాసితులు. తప్పించుకుని పారిపోయిన మరో సోదరుడు లల్లన్ సింగ్ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.