లక్నో : ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో రిక్షాను ఎదురుగా వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలవగా.. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం మౌదాహ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతులు ఇమిలియా, ఇంగోటా వాసులుగా తెలుస్తున్నది.