చండీగఢ్: అత్తమామలను కోడలు, ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేశారు. పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జనవరి 1న మంజిత్ సింగ్, ఆయన భార్య గుర్మీత్ కౌర్ను కోడలు, ఆమె ప్రియుడు కలిసి ఒక కుర్చీకి కట్టేసి సజీవ దహనం చేశారు. వారిద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని ఆ వృద్ధ గుర్తించడంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లో నుంచి డబ్బు, బంగారం తీసుకుని పారిపోయారు.
మరోవైపు వృద్ధ జంట కుమారుడు రవీందర్ సింగ్ రాత్రికి ఇంటికి తిరిగి వచ్చాడు. గేట్ లోపల నుంచి లాక్ చేసి ఉండటాన్ని గమనించాడు. అతి కష్టం మీద ఇంటి లోపలికి వెళ్లి చూడగా ఒక కుర్చీలో కట్టేసి కాలిపోయి ఉన్న తల్లిదండ్రుల మృతదేహాలు కనిపించాయి. అది చూసి షాకైన అతడు పోలీసులకు సమాచారం అందించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు రవీందర్ సింగ్ భార్యతోపాటు ఆమె ప్రియుడ్ని అరెస్ట్ చేశారు. దొంగిలించిన నగదు, బంగారు ఆభరణాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.