షాద్నగర్ : తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన సంఘటన గురువారం షాద్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తున్న కిషన్నాయక్ షాద్నగర్ పట్టణంలోని సిండికేట్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఓ శుభకార్యం నిమిత్తం ఈ నెల 9న తన ఇంటికి తాళం వేసి తమ స్వగ్రామమైన బిజిలి తండాకు తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. అనంతరం గురువారం ఉదయం తిరిగి ఇంటికి రాగ తమ ఇంటి తాళం పగులగొట్టి ఉండడాన్ని గమనించాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాను పగులగొట్టి అందులో ఉన్న రూ. 1.10లక్షల నగదు, విలువైన భూమి పత్రాలు, ప్లాట్ దస్తావేజులు, బ్యాంక్ పాస్ బుక్, ఏటీఎం కార్డును దోచుకెల్లారు.
బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి చలికాలంలో తరుచుగా చోరీలు జరుగుతున్నాయని, పోలీసులు పటిష్టమైన ఘస్తీ నిర్వహించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.