తాండూరు రూరల్ : హత్య కేసును 24 గంటలు గడువకముందే పోలీసులు ఛేదించి, నిందితున్ని రిమాండ్కు తరలించారు. తాండూరు మండలం, మల్కాపూర్ గ్రామానికి చెందిన మ్యాతరి రామప్ప (54)ను ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తున్న ప్రిన్స్ అనే వ్యక్తి ఇనుప పైపుతో కొట్టి అతికిరాతంగా హత్య చేశాడు. గురువారం తాండూరు రూరల్ సర్కిల్ కార్యాలయంలో హత్య కేసుకు సంబంధించి సీఐ జలంధర్రెడ్డి వివరాలు వెల్లడించారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన మ్యాతరి రామప్పకు ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీలో వెనకాల రెండు ఎకరాల పొలం ఉంది. అక్కడే పంట వేసుకొని, పొలంలో టీ దుకాణంతో పాటు మద్యం కూడా విక్రయించేవాడు.
ఫ్యాక్టరీలో వెనకాల కార్మికుల కోసం గదులు ఉన్నాయి. కార్మికులు పనులు ముగించుకొని ఆ గదులకు చేరుకుంటారు. గదుల దగ్గరలోనే మృతుడుకి చెందిన టీ దుకాణం ఉంది. కార్మికులు టీతో పాటు బీడీలు, సిగరెట్లు, మద్యం కోసం వస్తారు. అదే క్రమంలో ప్రిన్స్ అనే కార్మికుడు మద్యం కోసం మృతుడు వద్దకు వచ్చాడు. తన వద్ద ఉన్న రూ. 120 ఇచ్చి క్వార్టర్ మద్యం తీసుకున్నాడు. అదే విధంగా స్నాక్స్ కూడా తీసుకున్నాడు. మద్యం డబ్బులు ఇచ్చిన కార్మికుడు స్నాక్స్ డబ్బులు ఇవ్వలేదు. స్నాక్స్ డబ్బులు ఇవ్వాలని మృతుడు రామప్ప కార్మికుడిని డిమాండ్ చేశారు. ఇద్దరి మద్య డబ్బుల కోసం వాగ్వాదం చోటుచేసుంది. కొపోద్రిక్తుడైన ప్రిన్స్ రామప్ప గొంతును గట్టిగా పట్టి నొక్కాడు. దీంతో అతను సృహతప్పి కింద పడిపోయాడు.
పక్కనే ఉన్న ఇనుప పైపుతో అతి కిరాతకంగా పురుషంగం, ఛాతి, ముఖం పై గట్టిగ కొట్టడంతో పాటు పైపును గొంతుపై పెట్టి కాళ్లతో గట్టిగా తొక్కాడు. రామప్ప మృతి చెందాడని నిర్ధారించుకుని, ప్రిన్స్ అనే కార్మికుడు టీ దుకాణంలో ఉన్న సిగరేట్లు, బీడీల కట్టతోపాటు 10 మద్యం (క్వార్టర్) సీసాలు ఓ సంచిలో వేసుకొని తాను ఉండే గదికి వెళ్లాడు. అక్కడే హర్షద్ అనే మరో కార్మికుడు ఉన్నాడు. సంచిలో ఏమీ తీసుకువచ్చావని హర్షద్, ప్రిన్స్ను ప్రశ్నించాడు. తాను దుకాణం నుంచి తీసుకువచ్చానని తెలిపారు. వాటిని గది వెనకాల పొదలో దాచాడు. అదే కంపెనీలో పని చేస్తున్న మరో ఇద్దరు కార్మికులు కృష్ణ, గుడంబలు అక్కడి వెళ్లారు. అప్పటికే రామప్ప మృతి చెంది ఉన్న విషయాన్ని గమనించారు. వెంటనే మృతుని భార్య శ్యామమ్మకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేసి, హత్యకు దారి తీసిన సంఘటన పై సమగ్ర విచారణ చేపట్టారు.
ముందుగా ప్రిన్స్ స్నేహితుడు హర్షద్ను విచారించగా, ప్రిన్స్ సిగరేట్లు, బీడీలు, మద్యం బాటిళ్లు తీసుకువచ్చాడని, ఎక్కడవని ప్రశ్నిస్తే, సరైన సమాధానం ఇవ్వలేదని పోలీసులకు తెలిపారు. ఈ కోణంలో పోలీసులు ప్రిన్స్ను విచారించగా, ఈ హత్య తానే చేసినట్లు అంగీకరించాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై ఏడుకొండలు, సిబ్బంది ఉన్నారు.