అక్రమంగా లిక్కర్ తయారు చేసిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతన్ని పోలీసు కస్టడీ నుంచి తప్పించేందుకు స్థానిక గ్రామస్థులంతా ఎగబడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలో వెలుగు చూసింది. తికంగఢ్ ప్రాంతానికి చెందిన రాంపాల్ అనే వ్యక్తి అక్రమంగా లిక్కర్ తయారు చేసినట్లు మూడేళ్ల క్రితం కేసు నమోదైంది.
ఈ కేసులో రాంపాల్ను అదుపులోకి తీసుకోవడానికి 12 మంది పోలీసు అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లారు. రాంపాల్ను అదుపులోకి తీసుకొని తిరిగి వస్తున్న వారిపై.. స్థానిక గ్రామస్థులు దాడికి దిగారు. సుమారు 20 మంది తమ అధికారులపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి చేసిన వారిలో మహిళలు కూడా ఉన్నారని, రాళ్లు-కర్రలు పట్టుకొని పోలీసు వాహనాలపై గ్రామస్థుల దాడి చేశారని వెల్లడించారు.
అనంతరం పోలీసు కస్టడీ నుంచి రాంపాల్ను తప్పించారని చెప్పారు. ఈ దాడిలో ఐదుగురు పోలీసు అధికారులు గాయపడ్డారని, అలాగే పోలీసు వాహనాల అద్దాలు కూడా పగిలిపోయాయని పేర్కొన్నారు. పోలీసులపై దాడి చేసిన 20 మందిపై కేసు నమోదు చేశామని, వారిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.