ట్యాక్సీలో కూర్చున్న కస్టమర్లు ఎటు వెళ్లమంటే అటు వెళ్తున్నాడా క్యాబ్ డ్రైవర్. అలా అలా ఊరి చివరన వెహికిల్స్ ఎక్కువగా లేని రోడ్డుపైకి తీసుకెళ్లిన కస్టమర్లు.. అక్కడ కారు దిగేసి డ్రైవర్ను బెదిరించారు. అతని దగ్గర ఉన్న డబ్బంతా ఇవ్వకపోతే చంపేస్తామన్నారు. కస్టమర్లలో రెండో వ్యక్తి జేబులో నుంచి తుపాకీ తీశాడు. అది చూసిన డ్రైవర్ భయంతో వణికిపోయి తన వద్ద ఉన్న డబ్బులన్నీ ఇచ్చేశాడు.
ఆ తర్వాత పడుతూ లేస్తూ అక్కడి నుంచి పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. సివిల్ డిఫెన్స్ వాలంటీరుగా పనిచేసే సచిన్ (29), మౌసం అలియాజ్ మనోజ్ (27) ఇద్దరూ ఇలా చాలామంది క్యాబ్ డ్రైవర్లను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వీళ్లిద్దరి గురంచి ఉప్పందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితులను అరెస్టు చేశారు.
వాళ్లు డ్రైవర్లను బెదిరిస్తున్న తుపాకీ ఒరిజినల్ కాదని, బొమ్మ తుపాకీతో రాబరీలు చేస్తున్నారని గుర్తించారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. నిందితుల దగ్గర నుంచి ఒక వాగన్ ఆర్ కారు, ఒక మోటార్ బైక్, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.