పుట్టి నెల రోజులు కూడా కాలేదా పసికందు. అనారోగ్యంతో నానా ఇబ్బందీ పడుతున్నాడు. ఆ పసివాడి కష్టం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లారు. ఎలాగైనా తమ బిడ్డను కాపాడుకోవాలని ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. అంబులెన్సును పిలిపించి ఆస్పత్రికి బయలుదేరారు.
అయితే కొంత దూరం వచ్చే సరికి ఏదో విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోడ్డుపై నిరసనలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ జామ్ అయింది. వెనక్కు వెళ్లే పరిస్థితి లేదు. నిరసన కారుల వద్దకు వెళ్లి తమ అంబులెన్సుకు దారివ్వాలని ప్రాధేయపడ్డారు.
కానీ వీళ్ల మాటలు వారికి పట్టలేదు. దీంతో ఆ పసికందు సరిగా ప్రపంచాన్ని చూడకముందే కన్నుమూసింది. ఈ దుర్ఘటన పంజాబ్లోని ఖన్నా ప్రాంతంలో జరిగింది. అమృత్సర్-ఢిల్లీ జాతీయ రహదారిపై పంజాబ్ థేకా ములాజం యూనియన్ చేస్తున్న నిరసనల్లో ఈ హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.
అయితే స్థానిక సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ మాత్రం ఆ తల్లిదండ్రుల మాటలను కొట్టిపారేశారు. అంబులెన్సుకు నిరసనకారులు దారి ఇచ్చారని, ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.