ఒక్క క్షణం.. ఒకే ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఎంత బాగుండేది! కాపురంలో కలతలు కామనే కదా అని సర్దుకుపోతే సరిపోయేది. కానీ ఆ ఆలోచన శక్తిని కోపం మింగేసింది. క్షణికావేశం రెండు కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. సంగారెడ్డి జిల్లాలో భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా నలుగురు ఆత్మహత్య చేసుకోగా..సిద్దిపేట జిల్లాలో కన్నతండ్రే 14 నెలల బిడ్డకు కరెంట్ షాకిచ్చి అత్యంత పాశవికంగా హత్యచేశాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం గార్లపల్లికి చెందిన చంద్రకాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. బిజినెస్లో ఆశినంతగా లాభాలు రాకపోవడంతో కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో భార్య లావణ్యతో తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో గురువారం రాత్రి మరోసారి స్వల్ప వాగ్వాదం జరిగింది. దీంతో ఇద్దరు పిల్లలు ప్రథమ్(8), సర్వజ్ఞ(3)ను తీసుకుని లావణ్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు లోనైన చంద్రకాంత్ ఇంట్లో ఉరేసుకున్నాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికి పశ్చాత్తాపానికి గురైన లావణ్య.. భర్త ఏం చేస్తున్నాడో చూడమని పక్కింటి వారికి ఫోన్ చేసి అడిగింది. వారు ఇంట్లోకి వెళ్లి చూడగా.. చంద్రకాంత్ ఉరేసుకుని కనిపించాడు. ఇదే విషయాన్ని వాళ్లు లావణ్యకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన లావణ్య ఇద్దరు పిల్లలను ఆందోళ్ పెద్ద చెరువులో తోసేసి.. తాను ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి బంధువులకు సమాచారం అందించారు.
సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటకు చెందిన మిరిదొడ్డి రాజశేఖర్, సునీత దంపతుల మధ్య శుక్రవారం గొడవ జరిగింది. ఈ ఘర్షణలో భార్యను కొట్టి.. 14 నెలల పాపను తీసుకుని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారికి కరెంట్ షాక్ పెట్టి హత్య చేశాడు. ఆ తర్వాత ఇదే చివరి కాల్ అంటూ ఓ రైతుకు ఫోన్ చేసి చెప్పాడు. పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.