భోపాల్ : మధ్యప్రదేశ్ చింద్వారాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరా వాహనం బావిలో పడిపోగా.. ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నది. మరో ఆరుగురు గాయపడ్డారు. చింద్వారా జిల్లాలోని మోఖెడా పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడమావు గ్రామంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నది. గురువారం ఉదయం బావిలో నుంచి ఏడుగురి మృతదేహాలతో పాటు వాహనాన్ని పోలీసులు వెలికి తీశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భాజీపాని గ్రామంలో ఓ పెళ్లి వేడుకకు వెళ్లి.. తిరిగి వస్తున్న సమయంలో బొలెరో వాహనం.. ఎదురుగా బైక్పై వస్తున్న వ్యక్తిని తప్పించబోయి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని.. ఒకరిని ప్రాణాలతో రక్షించారు.
బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు ఒంటిగంట సమయంలో ప్రమాదం జరిగినట్లు ఉమ్రానాల ఔట్పోస్ట్ ఏఎస్ఐ తెలిపారు. బైక్పై వెళ్తున్న వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో బొలెరో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయిందని పేర్కొన్నారు. అయితే, మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్మార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ల పేర్కొన్నారు. ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంతాపం వ్యక్తం చేశారు.