ముంబై : దేశవ్యాప్తంగా సైబర్ నేరాల (Cyber Fraud) సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రోజుకో స్కామ్, గంటకో స్కీమ్తో సైబర్ స్కామర్లు ఆన్లైన్ అడ్డాగా చెలరేగుతూ అమాయకుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. లేటెస్ట్గా ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త సైబర్ ఫ్రాడ్లో ఏకంగా రూ. 3.3 కోట్లు నష్టపోయారు. భారత్లో వ్యాపారం చేయాలనుకుంటున్నానని ఓ ఉక్రెయిన్ మహిళ వ్యాపారిని సంప్రదించింది. రూ. 8 కోట్లతో కూడిన పార్సిల్ పంపానని చెబుతూ వ్యాపారిని నిండా ముంచింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉక్రెయిన్ మహిళ ఎసీమాగా తనను తాను పరిచయం చేసుకున్న నిందితురాలు ముంబైలో ఓ ప్రైవేట్ కంపెనీ యజమానిని ఈమెయిల్లో సంప్రదించింది.
భారత్లో తాను వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నానని ఆమె నమ్మబలికింది. బాధితుడి కంపెనీ నుంచి యంత్ర పరికరాలు కొనుగోలు చేస్తానని వివరాలు రాబట్టింది. ఆపై వ్యాపారంలో భాగస్వామినవుతానని ప్రతిపాదించింది. భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా రూ. 8 కోట్లతో కూడిన పార్సిల్ను పంపుతున్నట్టు పేర్కొంది. ఇక ఎసీమా నుంచి కొరియర్ బాక్స్ వచ్చినట్టు వ్యాపారికి సమాచారం అందింది.
ఇక కొద్దిరోజుల తర్వాత భారీ మొత్తంతో కూడిన బాక్స్ను జకార్తాలో ఇండోనేషియా అధికారులు సీజ్ చేశారని వ్యాపారికి ఫోన్ కాల్ వచ్చింది. బాక్స్ను పొందాలంటే పలు ఫీజులు చెల్లించాలని చెప్పారు. ఎసీమా సూచించిన విధంగా భారత్కు చెందిన 101 వేర్వేరు ఖాతాలకు బాధితుడు నగదు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆపై మరికొంత డబ్బు పంపాలని, ఐటీ రిపోర్ట్స్, పవర్ ఆఫ్ అటార్నీ, ఇన్సూరెన్స్ డాక్యమెంట్స్ సహా పలు పత్రాలను పంపాలని స్కామర్లు కోరడం. నెలల తరబడి తన డబ్బును తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
Read More :