మెహిదీపట్నం : పాత గొడవల నేపథ్యంలో ఓ యువకుడిని అతడి స్నేహితులే దారుణంగా హత్య చేసిన సంఘటన హుమాయూన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మాసాబ్ట్యాంక్ అహ్మద్ నగర్ ఫస్ట్లాన్సర్లో నివసించే సోహైల్ ఖాద్రి (32) వీడియో గ్రాఫర్గా పనిచేస్తున్నాడు.
అతడి స్నేహితులు మహ్మద్ అఫ్జల్ అలియాస్ నజీర్ అలియాస్ నజ్జు,అఫ్సర్ అహ్మద్ ఖాన్ అలియాస్ అఫ్ఫులతో రెండు నెలల క్రితం సోహైల్ ఖాద్రి గొడవ పడ్డాడు. అప్పుడు వారిద్దరు సోహైల్ను చంపుతామంటూ బెదిరించారు. శుక్రవారం తెల్లవారుజామున ఫస్ట్లాన్సర్ కట్ట ప్రాంతంలో సోహైల్ ఖాద్రి తీవ్రగాయాలతో పడి ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని అతడిని ఉస్మానియా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అక్కడ సోహైల్ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. శుక్రవారం సాయంత్రం ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
నజ్జు, అఫ్ఫులు దాడి చేసి హత్య చేశారని సోహైల్ ఖాది సోదరుడు షాహిధ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.