జైపూర్: ముగ్గరు మహిళలు, ఇద్దరు చిన్నారులతో కలిపి ఐదు మృతదేహాలు ఒక బావిలో కనిపించాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు నిండు గర్భిణీలు. ఆ ముగ్గురు మహిళలు కూడా అక్కాచెళ్లెల్లు. అలాగే చనిపోయిన పిల్లల్లో ఒకరి వయసు నాలుగేళ్లు కాగా, మరో పసి బిడ్డ వయసు 27 రోజులు. కట్నం కోసం అత్తమామలు వారిని హత్య చేసినట్లు స్థానికులు ఆరోపించారు. రాజస్థాన్లోని జైపూర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. డూడు పట్టణానికి చెందిన ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులతో కలిసి బుధవారం నుంచి కనిపించలేదు. అయితే వారి ఇళ్లకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని ఒక బావిలో ఐదుగురి మృతదేహాలను శనివారం కనుగొన్నారు. హత్యకు గురైన మహిళలను కలు దేవి, మమత, కమలేష్గా గుర్తించారు. వారిలో మమత, కమలేష్ నిండు గర్భవతులని పోలీసులు తెలిపారు. చనిపోయిన ఇద్దరు పిల్లలు కలు దేవి పిల్లలని చెప్పారు.
కాగా, కట్నం కోసం అత్తమామలు ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలను హత్య చేసినట్లు స్థానికులు ఆరోపించారు. 15 రోజుల కిందట కలు దేవిని అత్తింటి వారు కొట్టారని, దీంతో ఆమె కంటికి గాయమైందని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే ఈ దారుణం జరిగిందన్నారు. బుధవారం కనిపించకుండా పోయిన వారిని వెదకడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని స్థానికులు ఆరోపించారు.