అమరావతి : చిత్తూరు జిల్లా సదుం మండలం ఎగువజాండ్రపేటలో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. అనంతపురం జిల్లా మదనపల్లిలోని అంగళ్లు ప్రాంతానికి చెందిన రాధ, వెంకట రమణ, రాము కొంతకాలంగా వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్నారు. రాధారాణి, వెంకట రమణ హత్యకు గురికాగా రాము పరారీలో ఉన్నాడు. రాము ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
రాధారాణికి అనంతపురం జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది . నాలుగు నెలల క్రితం వీరు విడిపోయారు. అనంతరం సోదరుడు వెంకటరమణ, మిత్రుడురాముతో కలిసి ఎగువ జాండ్ర పేటకు వచ్చి నివాసముంటున్నారు. రాధారాణి, ఆమె సోదరుడు వెంకటరమణను రాత్రి బండరాయితో దారుణంగా కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.