జహీరాబాద్ : హైదరాబాద్ – ముంబై జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.. పోలీసులు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జహీరాబాద్ సమీపంలోని అల్గోల్ బైపాస్ చౌరస్తా వద్ద ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్ బస్సు – టాటా ఏసీ ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఆటో పూర్తిగా కాలిపోయింది. దీంతో ఆటోలో ఉన్న వ్యక్తి సజీవదహనం అయ్యారు. ఆటో హైదరాబాద్ నుంచి ఉద్గిర్ వైపు వెళ్తుండగా, ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయివేటు బస్సు ఢీకొన్నాయి. ట్రావెల్స్ బస్సులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాద ఘటనపై జహీరాబాద్ పట్టణ ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.