బావను బావమరిది, అతడి కుటుంబసభ్యులు దారుణంగా హతమార్చారు. కొట్టి చంపుతున్నట్లు హతుడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పి.. మరీ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన సూరారం కాలనీలో కలకలం సృష్టించింది.
సీఐ రమణారెడ్డి, హతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం..నాగర్కర్నూల్ జిల్లా, పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందిన పసుపుల ఆంజనేయులు(45) కుటుంబ కలహాలతో తన గ్రామంలోనే ఉంటున్నాడు. భార్య సరస్వతి, కుమార్తె జ్యోతి, వదిన లక్ష్మి కుటుంబాలు జగద్గిరిగుట్ట సమీపంలోని లెనిన్నగర్లో నివాసముంటున్నాయి. ఆంజనేయులు బావమరిది మైసయ్య కుటుంబం సైతం సూరారంకాలనీలోని దయానంద్నగర్లో ఉంటున్నది. మైసయ్య భార్య యాదమ్మ మూడు నెలల కిందట ఘట్కేసర్లో హత్యకు గురైంది. అయితే ఆమె మరణానికి ఆంజనేయులే కారణమని భావించిన మైసయ్య కుటుంబసభ్యులు అప్పటి నుంచి అతడిని హతమార్చేందుకు అదును కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో ఆంజనేయులు లెనిన్నగర్లో ఉన్నట్లు తెలుసుకున్న మైసయ్య.. బుధవారం రాత్రి ఫోన్చేసి మందు తాగుదాం రమ్మంటూ.. దయానంద్నగర్లోని తన ఇంటికి పిలిపించాడు. అందరూ కలిసి గురువారం తెల్లవారు జామున 1 గంటల వరకు మద్యం తాగారు. అనంతరం ఆంజనేయులుతో పథకం ప్రకారం గొడవకు దిగిన మైసయ్య(45), అతని కొడుకులు గంగులు(25), పవన్ ఆలియాస్ లడ్డూలతో పాటు మైసయ్య సోదరుడి భార్య యాదమ్మ, కర్రలతో చితక బాదడంతో పాటు కాళ్లు, చేతులు విరగ్గొట్టి, చిత్రహింసలు పెట్టారు.
ఇదే విషయాన్ని హతుడి కూతురు జ్యోతి, భార్య సరస్వతికి ఫోన్చేసి చెప్పారు. దీంతో ఆంజనేయులును ఏం చేయవద్దని, ఉదయం కూర్చుని మాట్లాడుకుందామని, అవసరమైతే పోలీస్స్టేషన్లో అప్పగించి సమస్యను పరిష్కరించుకుందామని వేడుకున్నారు. అయినా.. వినకుండా ఫోన్ కట్ చేసిన మైసయ్య కుటుంబసభ్యులు ఆంజనేయులును చంపేశారు. ఇదే విషయాన్ని గంగులు స్నేహితుడు శివ,అలియాస్ చింటూ మరోసారి జ్యోతికి ఫోన్ చేసి ఆంజనేయులును చంపామని, శవాన్ని తీసుకెళ్లమని చెప్పి ఫోన్ కట్ చేశారు. వెంటనే హతుడి కుటుంబసభ్యులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించగా ఆంజనేయులు రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు. జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.