Wanaparthy | వనపర్తి : సొంత అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని మూలమల్ల గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. మూలమల్ల గ్రామానికి చెందిన పాకనాటి రాంరెడ్డి (63), అతని తమ్ముడు పాకనాటి శ్రీనివాస్రెడ్డి మధ్య కొన్నేండ్లుగా భూవివాదాలు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో నాలుగేళ్ల కిందట ఒకరిపై ఒకరు గొడ్డళ్లతో దాడులు చేసుకున్నారు. కాగా, ఆదివారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద అన్నదమ్ములు మరోసారి ఘర్షణ పడ్డారు. గమనించిన స్థానికులు రాంరెడ్డి కుమారుడు శేఖర్రెడ్డికి సమాచారం అందించారు. శేఖర్రెడ్డి పొలం వద్దకు వెళ్లే సరికి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పోలీసులకు విషయాన్ని చెప్పాడు.
సీఐ కేఎస్ రత్నం నేతృత్వంలో ఎస్ఐ, పోలీసులు కలిసి పొలంలోని బావిలో గాలించగా రాంరెడ్డి మృతదేహం లభ్యమైంది. మృతదేహం తలపై బలమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించి, పంచనామా నిమిత్తం ఆత్మకూరు సర్కారు దవఖానాకు తరలించారు. పొలం వద్ద నుంచి తన బాబాయి శ్రీనివాస్రెడ్డి వెళ్తున్నట్లు గమనించానని శేఖర్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు శ్రీనివాస్రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తున్నది.