Maharashtra Accident | మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్తూ ఆరుగురు మృత్యువాతపడ్డారు. మంజర్సుంబా – పటోడా హైవేపై కారు – టెంపో ఎదురెదురుగా ఢీకొట్టకున్నాయి. పుణేకు చెందిన ఓ కుటుంబం వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు కారులో కేజ్ తహసీల్కు బయలుదేరారు. ఈ క్రమంలో కారు.. ఎదురుగావచ్చిన టెంపో ఢీకొట్టుకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.
వాహనాలు వేగంగా ఢీకొట్టుకోవడంతో.. కారు, టెంపు ఇరుక్కుపోయాయి. దీంతో క్రేన్ సహాయంతో వాటిని విడదీశారు. ప్రమాదం అనంతరం టెంపో డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పారిపోయాడని, ఆ తర్వాత పటోడా పోలీస్స్టేషన్లో లొంగిపోయినట్లు చెప్పారు. మృతులను రాంహరి చింతామన్ కుటే (40), సునీతా రాంహరి కుటే (38), రుషికేశ్ రాంహరి కుటే (19), ఆకాశ్ రాంహరి కుటే (15), ప్రియాంక రాంహరి కుటే (17), రాధిక సుగ్రీవ్ కేదార్ (14)గా గుర్తించారు. వీరంతా స్వస్థలం జివాచివాడి గ్రామానికి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు.