జగిత్యాల : అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఉన్నట్టుండి ఇంటి పైకప్పు నుంచి ఓ పాము నిద్రిస్తున్న వారిపై పడింది. ఆ ఇంట్లో ఉన్న పాపను పాము చుట్టేసింది.. దాన్నుంచి రక్షణ పొందేందుకు బాలిక ప్రయత్నించింది.. కానీ అంతలోపే ఆ పాపను పాము కరిచింది. ఇదంతా ఆ బిడ్డ తల్లిదండ్రుల కళ్లెదుటే జరిగింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గంటా హద్య(3) తన తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తోంది. గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇంటి పైకప్పులో అమర్చిన చెక్కల నుంచి పాము కింద పడింది. పామును చూసి తల్లిదండ్రులు అప్రమత్తమయ్యారు. అంతలోపే ఆ విష సర్పం బాలికను చుట్టేసింది. తల్లిదండ్రుల కేకలతో పాప నిద్ర లేచింది. ఆ పాపను పాము బారి నుంచి రక్షించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. తనను చుట్టేసిన పామును తీసేందుకు పాప కూడా యత్నించగా, కాటేసింది. దీంతో హుటాహుటిన చిన్నారిని మెట్పల్లి ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పాప మృతి చెందినట్లు జగిత్యాల వైద్యులు నిర్ధారించారు. పాపను కాటేసిన పామును గ్రామస్తులు చంపేశారు. మూడేండ్ల చిన్నారి చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.