పట్నా: గ్రామంలో జరిగిన ఎన్నికల్లో ఒక వ్యక్తి విజయం సాధించాడు. అతని అనుచరులంతా కలిసి సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు. ఇలా సంబరాలు చేసుకోవడంపై రాష్ట్ర పోలీసు శాఖ నిషేధం విధించినా కూడా వాళ్లు ఆగలేదు. ఈ వేడుకల్లో భాగంగా ఫుల్లుగా మందు కొట్టిన ఒక వ్యక్తి తుపాకీ తీసుకొని గాల్లో పేలుస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో ఇలా తుపాకీ పేల్చి సంబరాలు చేసుకోవడం జరుగుతూంటుంది.
బిహార్లో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. గయలోని ఒక గ్రామ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి అనుచరులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి తుపాకీ పేలుస్తూ గంతులేశాడు. అయితే దురదృష్టవశాత్తూ ఆ తుపాకీ తూటా తగిలి ఒక 13 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. సదరు బాలుడు ఇంటి ముందు నిలబడి ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
అయితే ఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని సమాచారం. ఈ ఘటనపై స్థానిక పోలీసు అధికారికి షోకాజ్ నోటీసు పంపినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆదిత్య కుమార్ తెలిపారు.