చండీఘఢ్ : మరో వ్యక్తితో భార్యకు సంబంధం ఉందనే అనుమానంతో భార్య, అత్తపై కాల్పులకు తెగబడ్డ వ్యక్తి ఆపై నేరుగా 35 కిలోమీటర్లు ప్రయాణించి యువకుడి(25)ని హత్య చేసిన ఘటన లూధియానాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పటేల్ నగర్కు చెందిన జస్వీందర్ సింగ్ తన భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై భార్యతో తరచూ ఘర్షణ పడుతుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం జస్విందర్ తన భార్య శివానీ అలియాస్ జస్ప్రీత్ కౌర్, అత్త వందనా లిఖిపై కాల్పులు జరిపాడు.
ఇద్దరు మహిళలపై కాల్పులు జరిపిన అనంతరం జస్విందర్ నేరుగా తన స్కూటర్పై 35 కిలోమీటర్లు ప్రయాణించి నూర్మహల్ చేరుకుని రోహిత్ అనే యువకుడిని కాల్చి చంపాడు. ఇక కాల్పులతో తీవ్ర గాయాలైన తల్లీకూతుళ్లను స్దానికులు లూధియానాలోని దయానంద్ బోధనాసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
నిందితుడు జస్విందర్ జలంధర్ కాలేజ్లో అడ్మిషన్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాడని, గత కొద్దిరోజులుగా విధులకు దూరంగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఇక శివానీ ఓ జ్యూవెలరీ షోరూంలో పనిచేస్తుండగా వీరిద్దరికి 15 ఏండ్ల కిందట పెండ్లయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని తెలిపారు.