కరీంనగర్, జూలై 8 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపికపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరీంనగర్ రూరల్ మండల పరిధిలో 80, కొత్తపల్లి మండల పరిధిలో 127 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, ఈనెల 15 తర్వాత ఇండ్లు కేటాయించడానికి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. రోడ్ల విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో ప్రాధాన్యమివ్వాలన్నారు. కరీంనగర్ రూరల్ మండలం ఆరెపల్లి, మొగ్దుంపూర్, కొత్తపల్లి మండల పరిధిలో ఎలగందుల, కమాన్పూర్, ఖాజీపూర్, చింతకుంట గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్, రోడ్లు భవనాల శాఖ ఈఈ సాంబశివరావు, మిషన్ భగీరథ ఈఈ చెల్మారెడ్డి, ఆర్డీవో ఆనంద్కుమార్, ఆర్అండ్బీ డీఈలు, ఏఈలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
రేపటిలోగా పనులు పూర్తి చేయాలి
కరీంనగర్, జూలై 8 (నమస్తే తెలంగాణ): జిల్లాలో పల్లె ప్రగతి నిధులతో చేపట్టిన వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, డంప్ యార్డులు, ఇతర అభివృద్ధి పనులను ఈనెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కరీంనగర్ డివిజన్ పరిధిలోని మండల ప్రత్యేకాధికారులతో పల్లెప్రగతి అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పల్లెప్రగతి కార్యక్రమానికి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సకాలంలో హాజరుకావాలన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంపై నిర్లక్ష్యం చేసే వారి వివరాలు తెలిపితే చర్యలు తీసుకుంటామన్నారు. మండలానికొక మెగా పల్లెప్రకృతి వనాన్ని పదెకరాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి మండలంలో 3, 4 గ్రామాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టి, ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డీఆర్డీవో శ్రీలత, జడ్పీ సీఈవో రమేశ్, డీపీవో వీరబుచ్చయ్య పాల్గొన్నారు.
సింగిల్విండో చైర్మన్కు అభినందనలు
చొప్పదండి ,జూలై 8: చొప్పదండి సహకార సంఘం ఆధ్వర్యంలో యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తి చేసిన సంఘం చైర్మన్ వెల్మ మల్లారెడ్డిని గురువారం కలెక్టర్ శశాంక అభినందించారు. గుమ్లాపూర్లో పీహెచ్సీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ చైర్మన్తో మాట్లాడారు. యాసంగిలో సహకార సంఘం ద్వారా ఎన్ని క్వింటాళ్లు కొనుగోలు చేశారని చైర్మన్ను అడుగగా, లక్షా 47 వేల క్వింటాళ్లు కొనుగోలు చేసి, రైతులందరికీ డబ్బులు అందజేసినట్లు తెలిపారు. వారి వెంట ఆర్నకొండ సింగిల్విండో చైర్మన్ మినుపాల తిరుపతిరావు ఉన్నారు.