ఆర్థిక వ్యవస్థను కరోనా అతలాకుతలం చేసింది. వైరస్ ప్రభావం కొంత తగ్గినా అది విసిరిన సవాళ్లను మాత్రం ఇంకా ఎదుర్కోవాల్సి వస్తున్నది. కరోనా కట్టడికి మాస్కులు ధరించడం అనివార్యం కావడంతో, వాటి తయారీ దేశవ్యాప్తంగా ఊపందుకున్నది. ప్రభుత్వ అధికారులు ప్రత్యేక చొరవతో మాస్కుల తయారీకి చేయూతనిస్తున్నారు. బిహార్లోని సీతామఢీ జిల్లా మేజిస్ట్రేట్ అభిలాషా కుమారి శర్మ అయితే, ప్రత్యేక శ్రద్ధతో ‘మాస్క్ ఫోర్స్ క్యాంపెయిన్’ నిర్వహిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ ఉద్యమానికి విస్తృత ప్రచారం కల్పించారు. గ్రామాల్లోని గృహిణులు, స్వచ్ఛంద సంస్థల్లోని మహిళల సాయంతో లక్షలాది మాస్కులు తయారు చేయించారు. మధుబని ఆర్ట్తో మాస్కులకు కొత్త హంగులు అద్దారు. ‘మాస్కుల తయారీలో 13,545 మంది మహిళలు భాగమయ్యారు. వీరంతా ఏడాదిగా రూ.1.30 కోట్ల్ల విలువ చేసే మాస్కులను తయారు చేశారు. వీటిని పేదలకు, వలస కార్మికులకు ఉచితంగా పంచుతున్నారు. ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటున్న మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అన్నారు
అభిలాష. వీరి ప్రయత్నానికి ప్రధాని ప్రశంసలు కూడా దక్కాయి.