రూ.9కోట్లతో ఐదెకరాల్లో ఏర్పాటుకు నిర్ణయం
సందర్శకులను ఆకట్టుకునేలాపెద్దచెరువుకు హంగులు
ట్రంక్లైన్ పనులను పది రోజుల్లోగా పూర్తి చేయండి
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
మీర్పేట్, జల్పల్లి మున్సిపల్ కార్పొరేషన్లలో పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష
రంగారెడ్డి, జూన్ 3, (నమస్తే తెలంగాణ) : వర్షకాలం సమీపిస్తున్న దృష్ట్యా ట్రంక్లైన్ పనులను పది రోజుల్లోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం తన చాంబర్లో మీర్పేట్, జల్పల్లి మున్సిపల్ కార్పొరేషన్లలో పలు పనులపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో స్థానికులకు ఇబ్బంది కలుగకుండా చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పెద్ద చెరువుకు సుందరీకరణ పనులను, లైటింగ్, బండ్ వెడల్పు పనులను కూడా త్వరితగతిన చేపట్టాలని సూచించారు. అదేవిధంగా సందర్శకులను ఆకట్టుకునేలా, స్థానికులకు ఆహ్లాదాన్ని పంచేలా పెద్ద చెరువును తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి వెల్లడించారు. సమావేశంలో హెచ్ఎండీఏ ఈఈ రమేశ్కుమార్, డీఈ దన్మోహన్ సింగ్ పాల్గొన్నారు.
రూ.9కోట్లతో రాతి ఉద్యానవనం
జల్పల్లిలో రూ.9 కోట్లతో రాతి ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. సృజనాత్మకత, కళారూపాలతో కూడిన రాతి ఉద్యానవనాన్ని నగరంలోనే తొలిసారిగా జల్పల్లిలో ఏర్పాటు చేస్తున్నట్లు, సంబంధిత పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాతి ఉద్యానవనం ఏర్పాటుకుగాను 5 ఎకరాల స్థలాన్ని హెచ్ఎండీఏకు వెంటనే అప్పగించాలని బాలాపూర్ మండల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జల్పల్లి చెరువుకు అనుసంధానంగా రాతి ఉద్యానవనం ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా సందర్శకులకు ప్రత్యేకంగా బోటింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రజలు అధికంగా సందర్శించే వీలున్నందున ఫుడ్ కోర్టులను, చుట్టూ ఉన్న చెరువులను వీక్షించేందుకు వ్యూ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా రాత్రివేళల్లో విద్యుత్తు కాంతులు విరజిమ్మేలా చెరువు చుట్టూ ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. సమావేశంలో హెచ్ఎండీఏ కార్య నిర్వాహక ఇంజినీర్ పద్మ, అసిస్టెంట్ ఇంజినీర్ శివకుమార్రెడ్డి పాల్గొన్నారు.