న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో బ్రహ్మాస్త్రంగా పనిచేస్తున్న వ్యాక్సినేషన్పై సంకోచం వ్యక్తం చేయడమంటే ఆ కరోనా మహమ్మారికి ఆహ్వానం పలుకడమేనని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో టీకాలపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం వ్యాక్సిన్లపై అపోహలు, భయాలను వ్యాప్తి చేస్తున్నారని నఖ్వీ మండిపడ్డారు. అలాంటి వారిని దేశ ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సుకు వ్యతిరేకులుగా పేర్కొన్నారు. మన శాస్త్రవేత్తల శ్రమ ఫలితంగా దేశంలో ఉత్పత్తి అవుతున్న రెండు వ్యాక్సిన్లూ పూర్తి సురక్షితమైనవని ఆయన పునరుద్ఘాటించారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకొని కరోనా రహిత భారత్ సాధనలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా హజ్ కమిటీలు, వక్ఫ్ బోర్డులు, వాటి అనుబంధ సంఘాలు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, మౌలానా అజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, విద్యాసంస్థలు, ఎన్జీవోలు, స్వయం సహాయక గ్రూపులు ఇలా అందరూ వ్యాక్సినేషన్ అవగాహన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు.