లాక్డౌన్ టైంలో కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ అండగా నిలిచాడు సోనూసూద్ (Sonu Sood). రీల్ లైఫ్లో విలన్గా భయపెట్టిన ఈ యాక్టర్ ఎవరికి ఆపదొచ్చినా తనవంతు సపోర్టు చేస్తూ రియల్ హీరో అయిపోయాడు. సోనూసూద్ మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. మోగా కీ బేటి (Moga Ki Beti campaign) క్యాంపెయిన్లో భాగంగా మోగా పట్టణంలో 1000 మంది విద్యార్థినులు, సామాజిక కార్యకర్తలకు తన సోదరి మాళవిక సూద్ సచార్తో కలిసి సైకిళ్లు (bicycles) పంపిణీ చేశాడు.
మోగా పరిసర ప్రాంతాల్లోని సుమారు 40-45 గ్రామాల విద్యార్థినులు సోనూసూద్ క్యాంపెయిన్తో లబ్ది పొందారు. ఇంటికి, స్కూల్కు మధ్య చాలా దూరం ఉంది. ఇంత చలిలో విద్యార్థినులు తరగతులకు హాజరవ్వడం చాలా కష్టం. 8 నుంచి 12వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థినులకు సాయం చేయడమే లక్ష్యంగా సైకిళ్లను పంపిణీ చేశామని, సామాజిక కార్యకర్తలకు కూడా సైకిళ్లు అందించామని సోనూసూద్ చెప్పుకొచ్చాడు.
సూద్ ఛారిటీ ఫౌండేషన్ బాధ్యతలను మాళవిక సూద్ నిర్వర్తిస్తుంది. సైకిళ్ల పంపిణీకి అర్హులైన వెనుకబడిన తరగతులకు చెందిన బాలికలను ప్రభుత్వ ఉపాధ్యాయుల బృందం గుర్తించి జాబితా తయారు చేసింది.