తారాగణం: శర్వానంద్, అమల, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సుజీత్ సారంగ్
మాటలు: తరుణ్భాస్కర్
నిర్మాణ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
నిర్మాతలు: ప్రకాష్బాబు, ప్రభు
దర్శకత్వం: శ్రీకార్తీక్ (Shree Karthick)
జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా, ఎంతటి కీర్తిని పొందినా ప్రతి మనిషిలో గతం తాలూకు ఏదో ఒక అసంతృప్తి ఉండటం సహజం. వర్తమానంతో సయోధ్య కుదిరినా.. గత జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. గతంలో ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది? మళ్లీ అవకాశం వస్తే ఆ తప్పుని సరిదిద్దుకొని ఉండేవాణ్ని అని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అనుకునే ఉంటారు. కానీ మనం గతంలోకి వెళ్లలేం. గతంలోకి వెళితే ఎలా ఉంటుందనే ఊహ మాత్రం మనిషికి ఎల్లప్పుడూ ఒక ఓదార్పునిస్తుంది.
అలా కాలం వెనక్కి వెళ్లి జీవితాన్ని వీక్షిస్తే ఎంత బాగుంటుందో అనే ఊహనే టైమ్ ట్రావెల్ కథలకు మూలం. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు టైమ్ ట్రావెల్ కథలు చాలా వచ్చాయి. ఆ ఒరవడిలో ఒక విభిన్నమైన కథే ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham). కెరీర్ ఆరంభం నుంచి కథాంశాల్లో కొత్తదనానికి, ప్రయోగాలకు పెద్ద పీట వేసే శర్వానంద్ (Sharwanand) మరోసారి తనదైన మార్క్ కథను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఈ టైమ్ ట్రావెల్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం..
కథ గురించి..
ఆది (శర్వానంద్) సంగీతమే ప్రపంచంగా జీవిస్తుంటాడు. ఇరవైఏళ్ల క్రితం అతని అమ్మ (అమల) యాక్సిడెంట్లో చనిపోతుంది. ఆమె జ్ఞాపకాలు ఆదిని ప్రతిరోజూ బాధిస్తుంటాయి. తాను భయపడిన ప్రతిసారి అమ్మ ఉంటే బాగుంటుంది కదా అనుకుంటాడు. ఆది స్నేహితులే శ్రీను (వెన్నెల కిషోర్), చైతూ (ప్రియదర్శి). బాల్యమిత్రులైన ఈ ముగ్గురూ ఒక్కో సమస్యతో బాధపడుతుంటారు. వీరికి పాల్ (నాజర్) అనే శాస్త్రవేత్త పరిచయం అవుతాడు. ఆయన ఇరవై ఏళ్లుగా టైమ్ మిషన్ను కనిపెట్టే ప్రయత్నాల్లో ఉంటాడు. చివరకు తన లక్ష్యాన్ని సాధిస్తాడు. తన టైమ్ మిషన్ ద్వారా గతంలోకి వెళ్లి తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఉందని చెబుతాడు. ఆది, శ్రీను, చైతూ అందుకు ముందుకొస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? గతంలోకి ప్రయాణం చేసిన ముగ్గురు మిత్రులు తమ తప్పుల్ని సరిదిద్దుకున్నారా? గత ప్రయాణంలో వారు సాధించినదేమిటి? అన్నదే మిగతా కథ..
కథా విశ్లేషణ…
అమ్మ సెంటిమెంట్తో ముడిపెట్టిన టైమ్ ట్రావెల్ కథ ఇది. ఇరవై ఏళ్ల క్రితం దూరమైన అమ్మని తిరిగి కలుసుకోవడం అనే బలమైన ఎమోషనల్ పాయింట్తో దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. గతంలో వచ్చిన టైమ్ ట్రావెల్ కథలకు పూర్తి భిన్నంగా అనిపిస్తుంది. సాధారణంగా అమ్మ సెంటిమెంట్ అనగానే భావోద్వేగాల్ని పండించడానికి ఎక్కవగా స్కోప్ ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు పూర్తిగా సఫలీకృతుడయ్యారు. తన స్వీయ జీవితానుభవాల నుంచి ఈ కథను రాసుకున్నాడు కాబట్టి మరింత హృద్యంగా తెరపై తీసుకురాగలిగాడు. ప్రథమార్థంలో ముగ్గురి మిత్రుల నేపథ్యంలో చక్కటి వినోదంతో కథను నడిపించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్గా వెన్నెల కిషోర్ కామెడీతో పాటు ప్రియదర్శి లవ్ట్రాక్ కావాల్సినంత హాస్యాన్ని పండించింది.
ఇంటర్వెల్ ట్విస్ట్ కథపై ఉత్సుకతను పెంచుతుంది. ఇక ద్వితీయార్థంలో అమ్మ సెంటిమెంట్పైనే కథను నడిపించారు. హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో సెకండాఫ్ సాగింది. అయితే కథా గమనం నెమ్మదిగా అనిపిస్తుంది. ఈ సినిమాలో దర్శకుడు వర్తమానం, గతంతో పాటు భవిష్యత్తును కూడా ముడిపెట్టి కథనాన్ని నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. టైమ్ ట్రావెల్ కథ కాబట్టి లాజిక్కుల జోలికి పోకుండా చూడాల్సిందే. ఈ సినిమా చూసిన తర్వాత కోల్పోయిన ప్రేమను తిరిగి పొందితే ఎలా ఉంటుందో కదా అనే భావన కలుగుతుంది. అమల-శర్వానంద్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ఎమోషనల్గా కట్టిపడేస్తాయి. పతాక ఘట్టాల్ని ఎలాంటి మలుపులు లేకుండా సాఫీగా ముగించారు.
నటీనటుల పనితీరు..
ఆది పాత్రలో శర్వానంద్ చక్కటి నటనను కనబరిచారు. ఆయన కెరీర్లో గొప్ప పాత్రగా మిగిలిపోతుంది. అమ్మ చేతి వంట తింటున్నప్పుడు శర్వానంద్ పలికించిన భావోద్వేగాలు హార్ట్టచింగ్గా అనిపిస్తాయి. ఇక అమల ఈ సినిమాకు ప్రధానాకర్షణగా చెప్పొచ్చు. తన అనుభవంతో అమ్మ పాత్రకు పరిపూర్ణత తీసుకొచ్చింది. చాలా విరామం తర్వాత బలమైన పాత్రలో ఆమె తెరపై కనిపించారు. అమల కెరీర్లో ఉత్తమమైన పాత్రల్లో ఒకటిగా నిలిచిపోతుంది. నాజర్ తనదైన శైలి నటనతో ఆకట్టుకున్నాడు. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ తమదైన హాస్యంతో మెప్పించారు. రీతూవర్మ అభినయం ఆకట్టుకుంది. సాంకేతికంగా ప్రతీ విభాగం ఉన్నతంగా అనిపించింది. జేక్స్ బిజోయ్ సంగీతం కథలోని ఉద్వేగాల్ని ఒడిసిపట్టింది. కెమెరా పనితనం బాగుంది. దర్శకుడు శ్రీకార్తీక్ (Shree Karthick) తన స్వీయానుభవాలతో కథ రాసుకున్నాడు కాబట్టి అంతే బలంగా సినిమాను తెరపై తీసుకొచ్చాడు.
తీర్పు..
అమ్మ సెంటిమెంట్ నేపథ్యంలో కాలం వెనక్కి వెళ్లి చేసే అందమైన ప్రయాణం ఇది. హృదయాన్ని హత్తుకునే కథ, కథనాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.
రేటింగ్: 3/5
Read Also : Hari Hara Veera Mallu | క్రిష్ సినిమాపై ఫోకస్..డేట్స్ కూడా ఇచ్చేసిన పవన్..!